Wednesday, March 26, 2025

అతి గోప్యం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

ఆ మధ్య మా దగ్గర బంధువు ఒకాయనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి, రెండు స్టెంట్స్ వేయించుకున్నాడట. కానీ ఆ విషయం బంధువులెవ్వరికీ తెలియకుండా వాళ్ళు జాగ్రత్తపడ్డారు. ఎందుకో మరి? ‘సంసారం గుట్టు, వ్యాధి రట్టు’ అని కదండీ మన పెద్దలు చెప్పింది? ఈమధ్య మానవ సంబంధాలు తూతూ మంత్రంగా తయారైనాయి. దీనికి తోడు అతి గోప్యాలు! మా పరిచయస్థులొకరు మా యింటికి వచ్చారొక రోజు. ఆయనకు కాఫీ ఇవ్వాలి కదా! మా శ్రీమతి, “సార్, మీకు చక్కెర వేయచ్చునా.. లేక..” అన్నది. భారత్ మధుమేహ రాజధాని గదా! అందుకాయన. “అబ్బే! నాకు షుగర్ అస్సలు లేదమ్మా! కాని పంచదార వేయకండి” అన్నాడు. ‘ఇదేదో విరోధాభాసాలంకారంలా ఉందే?’ అని అనుకున్నాను. లేక ముందుజాగ్రత్తేమో! తర్వాత ఎవరో చెప్పారు, ఆయన ‘వెరీ వెరీ స్వీట్ బోయ్’ అని, ఇన్సులిన్ కూడా తీసుకుంటాడని! ఎందుకీ గోప్యాలు!
ప్రఖ్యాత వ్యాసరచయిత ఫ్రాన్సిస్ బేకన్, ‘ఆఫ్ సిమ్యులేషన్ అండ్ డిస్‌సిమ్యులేషన్’ అనీ ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. ‘దాపరికం, బహిర్గతం’ అన్న మాట! కాని లోతుగా వెళితే, డిస్సిమ్యులేషన్ అంటే మన ఆలోచనలను, విషయాలను దాచి ఉంచడం. సిమ్యులేషన్ అంటే ఇతరులను మోసగించడం కోసం, ఒక కపటచిత్రాన్ని ఆవిష్కరించడం.
తెనాలి రామకృష్ణుడు మహాకవి. కాని ఆయనను ‘వికటకవి’గా ముద్ర వేశారు. ఆయన హస్యచతురతను రకరకాల కథలుగా సృష్టించారు. కల్పితాలయినా అవి బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్! ఆయన పాండిత్యం కంటే ఇవే చాలామందికి తెలుసు, మధ్యలో తెనాలాయన ఎందుకు? కొంపదీసి మీది తెనాలా? అనుకుంటున్నారా? కొంపతీయకున్నా, మాది తెనాలి కాదండోయ్! దాచమని అత్యంత గోప్యంగా చెప్పిన విషయాన్ని ఆయన సోషియల్ మీడియాలో ఎంత విస్తృతంగా ప్రచారం చేశాడో చూడండి! “అప్పుడు సోషియల్ మీడియా ఎక్కడుంది? పోదురూ! బడాయి!” అంటున్నారా! అది ఎప్పుడూ ఉంది: ఏమంటే రూపం వేరు!
తెనాలివారు ఒకసారి రాణీగారి మందిరానికి వెళ్లాడు. ఆయనకు రాజకుటుంబంతో క్లోజ్ రిలేషన్స్ ఉండేవి! నేరుగా లోపలికి వెళ్లగలిగే చనువు, చొరవ ఉన్నాయి. సరిగ్గా అప్పుడు, రాణీగారు మోచేతుల మీద విపరీతంగా గోక్కుంటున్నారు. రాణీగారయితే గొప్పా ఏం? దురదలకు అవన్నీ తెలియవు. ఆమె తెనాలి వారితో “స్వామీ! ఈ దురదలతో చచ్చే చావయింది. దయచేసి ఈ విషయం ఎక్కడా అనకండి!” అన్నది. “మహారాణి!
మీరంతగా చెప్పాలా?” అన్నాడు. తర్వాత ఆమె దేవాలయానికి బయలుదేరుతూ, ఈయననూ రమ్మంది. సింగిల్ గుర్రం పూన్చిన చిన్నవాహనంలో ఆమె వస్తుండగా, పరిజనులు, సైనికులు, ముందూ వెనుకా! ఇంతలో వికటకవిగారు గుర్రం మూతికి తన అంగోస్త్రం కట్టారు. బండికి పరదాలు! ఒక రాజ సేవకుడు అడిగాడు, “స్వామీ! ఎందుకలా కట్టారు?” అని. వికటకవి అతని చెవిలో రహస్యంగా చెప్పాడు “రాణిగారికి దురదలు! ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. గుర్రం ఏమయినా పొరపాటున ఎవరికైనా చెబుతుందేమో అని ఈ జాగ్రత్త! నీవు కూడా ఎవ్వరితో అనకు” అన్నాడు. ఆయన ఇదే మాట ఇంకొకాయనతో అన్నాడు. ఇలా మొత్తం అందరికీ తెలిసిపోయింది. సోషియల్  మీడియా చాలా పవర్‌ఫుల్.
ప్రాన్సిస్ బేకన్ గారు దాపరికాన్ని రకరకాలుగా పేర్కొన్నారు. మొదటిది ‘సీక్రెసీ’. తన భావాలు ఎవరికీ చెప్పడు. ఇది అంత హానికరం కాదట. ఇది కొన్నిసార్లు అవసరం కూడానట. రెండవది ‘హిపోక్రసి’. అంటే తనను ఇంకో రకంగా (మోసపూరితంగా) చూపించుకోవడం. మరీ ఎక్కువ దాపరికం మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తుందట.


‘ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు’ అని నానుడి. పాపం ప్రతీదానికి వాళ్లనెందుకండీ ఆడిపోసుకుంటారు? ఎందుకు నానదంటే నానే లోపు దాన్ని ఇతరులకు చేరవేస్తారనేమో! అది వారి బోళాతనాన్ని, దాపరికం లేని గుణాన్ని చూపిస్తుందంటా నేను! నేనసలే స్త్రీ జన పక్షపాతినని మీకు ఇదివరకే మనవి చేసి ఉన్నా! సెల్‌ఫోన్లు వచ్చింతర్వాత, ఆడవారి ‘విషయ బహిర్గత ప్రావీణ్యం’ నాలుగు రెట్లు పెరిగింది. అయినా వారికీ కాలక్షేపం కావాలి కదా! తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు ‘షేర్’ (సోషయల్ మీడియా భాషండోయ్!) చేస్తే తప్పులేదు. కాని, ‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత’ అన్నట్లుగా తమ సృజనాత్మకతను జోడించి, విషయానికి మసాలా దట్టించి వదలకూడదు. ఒకావిడ ఒక బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చింది. అమ్మాయి పేరును బట్టి అది కులాంతర వివాహం అని అర్థమైంది. ఇక ఈవిడ తన ‘కిత్ అండ్ కిన్’ అందరికే ఒకటే కాల్సు! దాన్ని మతాంతర వివాహంగా మార్చింది. దానికి ముందు ఉభయ కుటుంబాల్లో ఎన్ని గొడవలైనాయో (ఏ గొడవలూ అవలేదు, శుభ్రంగా ప్రేమించుకున్నారు, ఉభయులూ అంగీకరించారు) వివరించింది. నువ్వుగింజ నానకపోగా, బాగా ఉబ్బిందన్నమాట!
ఒక్కటి మాత్రం నిజం మాస్టారు. సత్యం ‘ఇంగువ కట్టిన గుడ్డ’ లాంటిది. దాన్ని ఎంత దాచాలనుకున్నా దాని సువాసన దాన్ని పట్టిస్తుంది. అబద్ధం అతి త్వరగా వ్యాపిస్తుంది. ఈ ఆధునిక సమాజంలో హిపోక్రసీ లేకుండా జీవించడం కష్టం. ఒక సూపర్ హిట్ సినిమాను, అది ఎంత చెత్తగా ఉన్నా, బాగులేదని చెప్పలేం. అలా ఉంది పరిస్థితి. సాధ్యమైనంత వరకు ఓపెన్ మైండ్‌తో ఉందాం! పదిమందికి తెలిస్తే మనకు మంచి జరుగుతుందంటే చెబుదాం! అతి గోప్యం హానికరం! అదన్నమాట!



నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 20వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 20వ భాగం సంచికలో చదవండి.
~
"అసూయాపరుడి మానసిక స్థితిని దుర్యోధన సార్వభౌముడిలా చెప్పాడు -
‘కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే, ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబుగలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు తనంతటివాడు గల్గినన్’  
ఈ పద్యం శ్రీనాథునిది. ‘కాశీఖండం’ అనే కావ్యంలో వింధ్యపర్వతంతో చెప్పించాడు మహాకవి. దానిని యన్.టి.ఆర్ గారు తమ ‘దానవీర కరకర్ణ’లో వాడుకున్నారు, సందర్భోచితంగా!”
సభికులు అతన్ని అభినందించారు. ఒథెల్లోను తీసుకొచ్చి శ్రీనాథునితో, NTR తో ముడిపెట్టినందుకు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-20/

 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 27వ భాగం లింక్

అనుకంపాపూరితుడైన అబ్జనాభుండు సురలతో నిట్లు పలికెను.
ఉ.:
వింటిని దైత్యు దుర్మదపు వికృత చేష్టలు, దుష్టకృత్యముల్
మింటను భాస్కరోదయము మించిన చీకటి బాపునట్లు, నా
కంటకు పాపముల్ పగిలి కర్మఫలంబది పండువేళ, మీ
కంటిన వాని పీడ తొలగన్ వధియించెద, నోర్పు పట్టుడీ!
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-27/

 

 

'తిరువణ్ణామలై, షోలింగర్ యాత్ర' - లింక్

తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర దర్శనం, రమణాశ్రమ సందర్శనం, గిరిప్రదక్షిణం తదితర వివరాలతో పాటు, షోలింగర్‍లో కొండపై వెలిసిన నృసింహ స్వామి ఆలయ దర్శనం  
పూర్తి కథనం సంచికలో చదవవచ్చు.

 

https://sanchika.com/thiruvannamalai-sholinger-yaatra-pds/

 

 

Thursday, March 20, 2025

మైట్యూబ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

నాకెందుకో, యూట్యూబ్‌కు మైట్యూబ్ అని పేరు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మిత్రమా! ఎందుకంటే ఎవరయినా సరే, ఒక ఛానెల్ పెట్టి, తమకు తెలిసింది. తెలియనిదీ చెప్పి, ఊదరకొట్టేయొచ్చు. నాకు కొంతమంది, “మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేయొచ్చు కదా!” అని ఒక అయాచిత, ఉచిత సలహా పారేస్తుంటారు. ఉచితాలు మంచివి కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టే హితవు చెప్పినా వాళ్లు వినరే! ఖర్చు లేని పని గదా! అప్పుడు, ఎవరో పంపిన ఒక జోక్ నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు, “పెద్దయ్యాక, నీవేమవుతావురా?” అని అడిగితే, “ఇంజనీరు అవుతా, లేదా డాక్టర్‌ను అవుతా, లేదా కలెక్టర్‌ను అవుతా” అని చెప్పేవాడట. తీరా పెద్దయ్యక “వెల్‍కమ్ టు మై యూట్యూబ్ ఛానెల్ ‘ఊకదంపుడు!’ లైక్! కామెంట్! అండ్ సబ్‌స్క్రైబ్!” అంటూ తయారయ్యాడట!
ఈమధ్య సొంతంగా యాట్యూబ్ ఛానెల్ పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. పవన్ అన్న చెప్పినట్లు, ‘ట్రెండ్ సృష్టించడమే గాని, ఫాలో అవను’ అన్నది ఈ సోకాల్డ్ యూట్యూబర్లకు వర్తించదు. ‘బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్!’ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది లెండి. అంటే ఎవడి తప్పెట (డబ్బా!) వాడు మోగించుకోవడం. మైట్యూబర్లు, సారీ. యూట్యూబర్లు చెప్పేదానికి, చూపేదానికి ఫలానా ప్రమాణం అంటూ ఏవీ ఉండనవసరం లేదు సోదరా! మనకు వచ్చింది, నచ్చింది, చెప్పేయవచ్చు.
యూట్యూబర్‍లలో చాలామంది వాడే ఊతపదం ‘ఐతే’. ప్రతి వాక్యంలో కనీసం నాలుగైదు ఐతేలు ఉంటేగాని వారికి నోరు పెగలదు మరి. మా ఉద్యోగ పెన్షనర్ల ఛానెల్స్ బోలెడు. ‘ఐ.ఆర్, డి.ఎ.లపై సంచలన ప్రకటన! ఉద్యోగ పెన్షనర్లు సంబురాలు!’ అని పైన ఉంటుంది. ఓపన్ చేస్తే, దాన్ని ప్రకటించింది. యూనియన్ వాళ్లు! విసుగొచ్చి మావాళ్లు అవి చూడడం మానేశారంటే నమ్మండి!
‘పద్యవీణ’ అని చానెల్ పెడతాడొక శాల్తీ. ఆయనకు పద్యం రాగయుక్తంగా చదవడం రాదు. వివరణ ఎంత ఘోరంగా ఉంటుందంటే, “ఆకాశవాణి! అల్లాటప్పా కేంద్రం! వార్తలు చదువుతున్నది వెంగళప్ప!” లెవెల్లో సాగుతుంది. ఇంకో ఆయన తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రముఖ నటులు ఉన్న సన్నివేశాన్ని చూపుతూ, సౌండ్ మ్యూట్ చేసి, ఈయన ఆ పద్యాలను పాడుతుంటాడు. ఎంత స్ట్రాటజీయో చూడండి! యన్టీఆర్‌ను, యస్వీఆర్‌ను చూడ్డం ఎవరికైనా ఇష్టమే కదా! కాని అక్కడ పాడుతున్నది ఘంటసాలవారు కాదు, మైట్యూబర్!
ఇంకొకాయన, మార్కర్ పెన్‌తో డిస్ ప్లే బోర్డు మీద రాస్తూ, కొట్టేస్తూ, తుడుపుతూ నానా పాట్లు పడుతుంటాడు వివరిస్తూ! పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అన్నమాట! దాంట్లో పవరూ ఉండదు, పాయింటూ ఉండదు! నీరస నిస్సార ప్రెజెంటేషన్ మాత్రం ఉంటుంది.



ఇంతకు ముందు టి.వి. ఛానళ్లలో డిబేట్లలో పాల్గొనే సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొందరు, ‘మైట్యూబర్స్’ అవతారమెత్తారు. ఏదో ఒక పార్టీకి విధేయులే. కాని చాకచక్యంగా దానికి ‘నిస్పక్షపాత పూత’ పూస్తారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ సి.ఎం.కు ఇంకా ప్రజాదరణ వెల్లువెత్తుతోందని వాదిస్తారు. ఈ పొలిటికల్ లాయల్టీస్ మనలాంటి అజ్ఞానులను తికమకపెడతాయి. ‘యద్భావం తద్భవతి’ అన్న సూత్రం వీరికి కరెక్ట్‌గా సరిపోతుంది. కాని వారి ‘భావం’ మనకు ‘భవతి’ ఐతే మటుకు చిక్కే.
ఇక పండగలు, ప్రాశస్త్యాలు, ఆధ్యాత్మిక విషయాలయితే ఇక చెప్పనక్కర లేదు. మైట్యూబయ్యలు, మైట్యూబమ్మలు విజృంభించి చెప్పేస్తుంటారు, అందరికీ తెలిసినవే అయినా, వాళ్లే కనిపెట్టినట్లు! ఎవరయినా లబ్ధప్రతిష్ఠుల వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా నెగెటివ్‌గా బయటకు వచ్చిందనుకోండి! ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక!’ ఐనా, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో, తీర్మానించేస్తుంటారు! ఎవరిది కరెక్టో తెలియక ‘వ్యూయర్స్’కు మకతిక!
ఇక వంటలు చేసి చూపించే వాళ్లయితే “హాలో ఫ్రెండ్స్!” అంటూ మొదలుపెట్ట “నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి” అని స్వకల్యాణం, విశ్వకల్యాణం గురించి చెప్పి, ఒంగోలు గంగాళం ఉప్మా, కర్నాటక కారాబాత్, పప్పు, చారు కూడా చాలా వివరంగా చేసి చూపిస్తారు. ఈ మధ్య కొందరు బొగ్గుల కుంపటి, మట్టి పాత్రలు, మూకుడులు, పైగా వాటికి విభూతి రేఖలు, కుంకుమ పెట్టి, సదాచార సంపన్న వంటలు చేస్తారు. కొందరు పొలాల్లో మూడు రాళ్లు పెట్టి, కర్రలు మండించి వంట చేస్తారు. అవన్నీ చూడడానికి బాగుంటాయి, చేసేవారికి నాలుగు రాళ్లు (అదేనండి బాబు, డబ్బులు) వస్తాయి గాని, అలా వంటలు చేసే కాలం ఎప్పుడో పోయింది.
అలాగని అందరూ అలాంటివారని కాదు నా ఉద్దేశం. చక్కని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసి చూపించే యూట్యాబర్లు కూడా ఉన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని వారు చక్కగా ప్రకాశింప చేస్తారు. వ్యూయర్‌షిప్ కోసం వారు చేయరు. అలాంటి వాళ్లను మైట్యూబర్స్ అనలేం. ‘వుయ్‌ట్యూబర్లు’ అంటే బాగుంటుంది. మైట్యూబర్లలో లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారండోయ్! డబ్బుదేముందండీ మాస్టారు! కుక్కను కొడితే రాలుతుంది! అలాగని కొట్టి చూసేరు! ఇంకేం? మీరూ ఒక ‘మైట్యూబ్’ పెట్టి చెలరేగిపోండి! అదన్నమాట!



ఉషా వారపత్రికలో నా కథ ఏకాంతం

ది 18 మార్చ్ 2025 నాడు వెలువడిన ఉషా వారపత్రికలో, సరస కథల పోటీలో ఎంపికైన నా కథ, 'ఏకాంతం' ప్రచురితమైంది.
ఈ క్రింది ఇమేజ్‍లపై నొక్కి కథను చదవండి.

 


 


 Click on the image to view in bigger size

 

 



నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 19వ భాగం సంచికలో

 డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 19వ భాగం సంచికలో చదవండి.
~
నిజమే! భగవంతునికి భక్తుడవడం సరేగాని మిత్రుడవడం, అంత ప్రేమను పొందడం కుచేలుని ప్రత్యేకత.
ఆయనను దేవునిగా కాకుండా, ఇష్టసఖునిగా, చనువుగా చూడడం సుదామునికే చెల్లింది. అందుకే మనం సినిమాలలో చూసినట్లుగా, కుచేలుడు భక్తిపారవశ్యంతో, చేతులు మోడ్చి, వంగిపోయి, వంకరలు తిరుగుతూ, కళ్ల నీళ్లతో ప్రవర్తించలేదు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-19/