Wednesday, July 16, 2025

నానా అటాచ్‌మెంట్స్!- దత్తవాక్కు- ఆంధ్రప్రభ

నాన్-అటాచ్‌మెంట్ ఉంది, డిటాచ్‌మెంట్ ఉంది. మరి ఇదేమిటి? అని అనుకుంటున్నారా? ‘నానా’ అంటే ‘రకరకాల’ అని అర్థం. నాన్‌స్టాప్ బస్ సర్వీసుకు పల్లెవెలుగు బస్ సర్వీస్‍కు తేడా అదే. రెండవది ‘నానా స్టాప్’ అన్నమాట.
‘నాన్-అటాచ్‌మెంట్’ అన్న మాటలో ఆధ్యాత్మిక సుగంధాలున్నాయి. దాన్ని ‘నిస్సంగత్వం’ అని తర్జుమా చేయవచ్చు. అది చాలా గొప్ప సుగుణం. ఆచరించడానికి గహనం కూడా. ఆదిశంకరాచార్యుల వారు తమ ‘భజగోవిందం’ స్తోత్రంలో దీన్ని ఎలా సాధించాలో చెప్పారు.
‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, 
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః 
భజగోవిందం, భజగోవిందం, భజగోవిందం మూఢమతే!’

అన్నాణా పరివ్రాజక శ్రేష్ఠుడు. 
సంబోధనను గమనించండి. ‘ఓ మూఢమతే!’ అని. ‘నాన్-అటాచ్‌మెంట్’ ను సాధించడం ఎలాగో ఒక క్రమానుగతశ్రేణిని శంకరులు బోధిస్తున్నారు. సత్పురుషుల సహవాసం చేస్తే నిస్సంగత్వం లభిస్తుంది, దాని వల్ల మోహం నశిస్తుంది. మోహం ఎప్పుడయితే దూరం అవుతుందో అప్పుడు నిశ్చలతత్తం అలవడుతుంది. అది జీవన్ముక్తికి దారి తీస్తుంది.
‘డిటాచ్‌మెంట్’ అనేది వైరాగ్యానికి సమానార్థకం కాదు అని నా అభిప్రాయం. ఒక రకంగా అది నెగెటివ్ టర్మ్. రోమ్ నగరం తగలడిపోతుంటే ఆయనెవరో, నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడని... అంటారు. దీన్ని డిటాచ్‌మెంట్ అందామా? నాన్ అటాచ్‌మెంట్ అయితే కాదు.
మన జీవితంలో ‘నానా’ అటాచ్‌మెంట్స్ ఉంటాయి. అవి మనల్ని వదలవు. మనమే వదిలించుకోవాలి. అలాగని అన్నింటినీ త్యజించి సన్యాసం తీసుకోకూడదు. అలా బలవంతంగా సన్యాసం తీసుకొంటే ఏమవుతుందో, ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలో, రేలంగి పాత్ర ద్వారా 1959 లోనే చూపించారు చక్కగా. ఆ పాటను పింగళి వారు వ్రాయగా, (ర)సాలూరు రాజేశ్వర రావుగారు స్వరపరిచారు. ఘంటసాల మాస్టారు పాడారు. బైటికి హస్యం అనే చక్కెర అద్దినా, అంతర్లీనంగా నిజమైన నాన్-అటాచ్‌మెంట్‌ను పింగళి పలికించారు, రేలంగి “కాశీకి పోయాను, గంగతీర్థమ్ము తెచ్చాను” అంటే, గిరిజ “కాశీకి పోలేదు, అవి ఊరి కాల్వలో నీళ్లండి” అంటుంది. అలా అతని ప్రతి మాటకూ ఆమె ఇచ్చే రిటార్టులో ఎంతో అర్థముంది. కుహనా సన్యాసత్వం ఎంత హాస్యాస్పదమో తెలుస్తుంది.
“టు బి యాన్ ఐడియల్ హౌస్ హోల్డర్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దేన్ టు బి ఎ సన్యాసి” అన్నారు స్వామి వివేకానంద. అందుకే మహర్షుల్లో చాలా మంది గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తూనే, నిస్సంగత్వం పొందగలిగారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దీనికి చక్కని ఉదాహరణ.


కుటుంబంలో ఉంటూ, బాధ్యతలు నెరవేరుస్తూనే, వాటికి అతీతంగా ఉండాలి. సుఖదుఃఖాలను సమదృష్టితో స్వీకరించాలి. శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వాములవారు తమ అనుగ్రహ భాషణంలో ఒక కథ చెప్పారు. ఒక ఊర్లో ఒక సన్యాసి సత్రంలో మకాం. ఆ ఊరి భూస్వామి కొడుకు, ఒక పేద అమ్మాయిని నమ్మించి, గర్భవతిని చేశాడు. తన పేరు చెబితే ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించాడు. భయపడి, తల్లిదండ్రులకు, తన ఈ స్థితికి కారణం సత్రంలోని సన్యాసి అని చెప్పింది! అందరూ వెళ్లి ఆ సన్యాసిని చితక్కొట్టారు. దుర్భాషలాడారు. ఆ అమ్మాయిని ఆయన వద్దే వదిలేశారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆమెను తీసుకొని వేరే ఊరికి వెళ్లి, భిక్షాటన చేసి, ఆ అమ్మాయిని పోషిస్తూ కంటికి రెప్పలా చూసుకొంటున్నాడట. ఆమె పశ్చాత్తాపపడి, వెళ్లి, తన వారికి నిజం చెప్పింది. వాళ్లంతా వచ్చి, సన్యాసి కాళ్ల మీద పడి, పూలు పండ్లు సమర్పించి, క్షమించమన్నారు. అప్పుడూ ఆయనేం మాట్లాడలేదట. అదే అసలు సిసలు నాన్-అటాచ్‌మెంట్! ఆ స్థాయికి మనం చేరలేకపోయినా, ప్రతిదానికీ అతిగా స్పందించకపోతే బెటర్. దీన్ని కృష్ణపరమాత్మ “దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః” అని స్థితప్రజ్ఞులను నిర్వచించాడు. ‘తామరాకుపై నీటి బొట్టు’ దీనికి మంచి పోలిక. తామరాకుపై నీటిబొట్టు నిలవదు. ముత్యంలా జారిపోతుంది. ఆకుకి తడి అంటదు. వివేకానంద కూడా దీన్ని ఉదహరించారు.
సచిన్ టెండూల్కర్ చూడండి. సెంచరీ చేసినా, నాలుగైదు రన్స్ చేసినా, డక్ ఔట్ ఐనా ఒకేలా ఉండేవాడు. అబ్దుల్ కలామ్ గారిని, “మీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయింతర్వాత ఏం చేస్తారు?” అని అడిగితే “పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను!” అన్నారట. పరిణతి చెందిన రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అదే సంయమనంతో ఉంటారు. “పలికించెడివాడు రామభద్రుండట” అని పోతన, “నాహం కర్తా, హరిః కర్తా” అని మధ్వాచార్యులవారు తమ నిస్సంగత్వం చాటారు. దట్సాల్ యువరానర్!





No comments:

Post a Comment