Monday, May 19, 2025

బెదిరింపు రాయబారం! - దత్తవాక్కు- ఆంధ్రప్రభ దినపత్రిక

సహజంగా ‘రాయబారం’ అంటే కాంప్రమైజ్ చేసి, ఇరుపక్షాల మధ్య ఘర్షణ లేకుండా చూసేది కదా! కానీ, మనకు తెలిసిన రాయబారాలన్నీ ఘర్షణ పెంచి, యుద్ధాలు తప్పనిసరిగా జరిగేలా చేశాయి! అత్యంత ప్రసిద్ధి గాంచిన శ్రీకృష్ణ రాయబారమే తీసుకొందాం. మొదట్నించీ పరమాత్మకు పాండవులు, కౌరవుల మధ్య సయోధ్య ఇష్టం లేదు. వెళ్లే ముందు, పాండవులు కొంచెం మెత్తబడి, సంధికి మొగ్గు చూపితే, వాళ్లను రెచ్చగొట్టాడు! ఇక కౌరవ సభలో, ఆయన “మా భీముడి గద అంటే ఏమనుకున్నారు? మా అర్జునుని గాండీవం ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?” అని వారిని బెదిరించాడు. తాను ‘దండంబున్ గొని దోలు స్యందనము మీదన్’ సారథిగా ఉంటానన్నాడు. “ఒక్క దుర్యోధనుని అసూయ కోసం మీరంతా చావకండి” అన్నాడు.
శా.:
“ఈ దుర్యోధనుడింత గర్వియగునే యీ యున్నవారెల్ల, నా
చే దైన్యంబున. బొందు టొప్పదని చర్చింపండ; యీ భంగికిన్‌
లేదే యొండు దెఱంగు సత్కులము బాలింపంగ వర్ణింప, రా
దే దుష్టాత్మకు నీచునొక్కరుని, బోదే భేదమీ జాతికిన్‌?”

రాయచారం ముగిసింది. ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుంటున్నాడు. ఈయన బెదిరింపులకు వారు బెదరలేదు. పైగా ఆయన్నే బంధించాలని చూశారు! ఆయనకు కావలసిందీ అదే. వీడ్కోలు మాటలు చూడండి.
ఉ.
“రోషము నాపయిం గలిగి క్రూరత గౌరవు లింతసేత సం
తోషమ, నీవు ప్రాభవముతో తగ నాకు ననుజ్ఞ యిమ్ము; ని
ర్దోషత నేను నోపుగతి దోర్బల దుర్జయులైన వారి వి
ద్వేషము జక్కం బెట్టి, జగతీవర! యింతకు పోయి వచ్చెదన్‌”

యుద్ధం జరిగితే కృష్ణునికేం ప్రయోజనం? దుష్టశిక్షణ. ధర్మరక్షణ. అదే కదా కృష్ణావతార పరమార్ధం.
ద్రుపద పురోహితుని రాయబారం కూడా విభిన్నం. ఆ విప్రుడు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ఆయనను భీష్ముడిలా పొగిడాడు -
కం.
“నీ వాక్యము విప్రస్వా/భావికమై యిట్లు శృతికి బరుషంబయినన్‌
భావింప గార్యమున యం/దే విధమున సభకు నింత నిష్టంబగునే!”

ఇక సంజయ రాయబారం. ఆయన ప్రాజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. ధృతరాష్ట్రుని పట్ల మొక్కవోని రాజభక్తి గలవాడు. ‘రాజ్యభాగం లేకుండా, మంచి మాటలతో సంధి చేసుకు రమ్మ’ని గుడ్డిరాజు చెప్పడంలో ఆయన కుటిల స్వభావం అర్థమవుతుంది. తిరిగి వచ్చి, రాజుతో ఇలా చెబుతున్నాడు.
ఉ.:
మానుషశక్తి యొల్లడు సమంచిత దైవమ యూదియుండు నీ
పైన నతండు పుణ్యమును పాపము బెట్టిన వాడు నీవు నీ
సూను వశంబ కాని యొక చొప్పు దలంపవు కర్ణ సౌబలా
ధీనము కార్య నిశ్చయము దెల్లము నీమత మొప్పదేమియున్.

సంధి పొసగేది కాదని, నిజం నిష్ఠూరమైనా చెప్పేశాడు సంజయుడు.
ఆంజనేయస్వామి, అంగదుడు, రావణాసురుని వద్దకు రాయబారం వెళ్లినపుడు కూడా, బెదిరింపులే తప్ప, నచ్చచెప్పినట్లుగా కనబడదు. స్వయంగా బల ప్రదర్శన కూడా చేసి వచ్చాడు అంగదుడు.
రెండవ ప్రపంచయుద్ధంలో భారతీయుల మద్దతు కూడగట్టడం కోసం, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, రాయబారిగా వచ్చాడు. ఆయన సాంప్రదాయకంగా, వామపక్ష లేబర్ పార్టీకి చెందినవాడు. భారత స్వపరిపాలనకు అనుకూలుడు. కాని, భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి పూర్తిగా విముఖుడైన చర్చిల్ నాయకత్వంలోని సంకీర్ణ యుద్ధ క్యాబినెట్ సభ్యుడు. “యుద్ధంలో మాకు మద్దతిస్తే, తర్వాత మీకు మేం ఫ్రీడం ఇస్తాం” అని బేరం పెట్టాడు క్రిప్స్. కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ ఒప్పుకోలేదు. రాయబారం ఫెయిలయ్యింది.
‘బుగ్గానిపల్లె పంచాయితీ’ అని మా కర్నూలు జిల్లాలో ఒకటుంది లెండి. డోన్-నంద్యాల రైలు మార్గంలో బేతంచెర్ల తర్వాత ‘సిమెంట్‍నగర్’ స్టేషన్ వస్తుంది. ఆ ఊరి పేరే బుగ్గానిపల్లె. అక్కడి పెద్దమనుష్యులు ఇరు పక్షాలకు సంధి కుదర్చకుండా, జాగ్రత్తగా పంచాయితీ చేస్తారు. ఇరువర్గాలూ నష్టపోయి, సంధి కుదిర్చేవారికే బెనిఫిట్! ఇదో రకం. వీళ్ళు రెండు వైపులా ఉన్నట్లు ఉంటారు. జోసెఫ్ అడిసన్, “మచ్ మైట్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్” అని సర్ రోగర్ డి కావర్లీ తో ఒక చోట ‘స్పెక్టేటర్’ వ్యాసాలలో చెప్పిస్తారు. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలకు అదే ప్రేరణ అని చెబుతారు. కర్ర విరగకుండా, పాము చావకుండా చేసే రాయబారం ఇది. ఇది చాలా ప్రమాదకరం!


భార్యాభర్తలు గొడవ పడితే, వారి మధ్య సయోధ్య కుదర్చడానికి రాయబారం చేయటమంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. ఎందుకంటే, ఎంతగా పోట్లాడుకున్నా, వాళ్లిద్దరూ ఎప్పటికైనా ఒకటే.
ఇంగ్లీషులో రాయబారిని ‘అంబాసడర్’ అంటారు. అప్పట్లో ఒక కార్ల కంపెనీ తమ కారుకు ఆ పేరును పెట్టింది. అప్పుడు కారంటే అంబాసడర్ కారే. రాయబారి ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉన్నతస్థాయి దౌత్యవేత్త. ఆయనను ‘ఎన్వాయ్’ అని కూడా అంటారు. తాను రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తాడు. రెండు దేశాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందిస్తాడు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐ.ఎఫ్.ఎస్) అధికారులతో రాయబారులుగా పంపుతారు. కామన్‌వెల్త్ దేశాలలోని రాయబారులను ‘హైకమిషనర్’ అంటారని మీకు తెలుసు. వీళ్లు కాక, బ్రాండ్ అంబాసిడర్స్ అని ఉన్నారు. విరాట్ కోహ్లి, అమితాబ్, షారుక్ ఖాన్ లాంటి వారు. వీరితో పేచీ లేదు.
రాయబారి సహనశీలుడు, స్థితప్రజ్ఞుడు, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నిష్ణాతుడూ అయి ఉండాలి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాకూడదు. అన్నట్లు, మీకెవరితోనైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను మీడియేషన్ చేస్తా! వద్దంటున్నారా? సరే సరే! అదన్నమాట!


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 35వ భాగం లింక్

వచనము:
"పుత్రా! ప్రహ్లాదకుమార! ఆ శ్రీహరి మనకు ఆగర్భశత్రువు. కపటి, నక్క జిత్తులవాడు. మీ పినతండ్రి హిరణ్యాక్షుని మాయోపాయమున వధించెను. వాని కొరకు సకల లోకములను గాలించుచున్నాను. దొరికిన యెడల వానిని చిత్రహింసల పాలుజేసి చంపెదను. నాకు భయపడివాడు ఎక్కడో దాగియున్నాడు. వాడా నీకు పూజనీయుడు! నాకు దివ్య వరప్రదాతయైన ధాతనారాధింపుము. లేదా కైలాసవాసియైన పరమేశ్వరు గొలువుము. అంతియగాని, నావైరియైన హరిని మాత్రము స్మరింపకము. దైత్యకుల దీపకుడగు నీవు మన వంశమునకు మచ్చ తీసుకురావలదు నాయనా! నీ తండ్రినైన నేను ఈ పదునాల్గు భువనములను శాసించుచున్నాను. అష్టదిక్పాలకులు, పంచభూతములు, నాకూడిగము చేయుచున్నారు. త్రిలోకములో ‘నమో హిరాణ్యాయ’ అని అందరును నన్నే స్తోత్రము చేయుచుండ, ఈ వెర్రి నీకేల?" అని తండ్రియుపన్యసింప, ప్రహ్లాద కుమారుడు వినయముతో నిట్లనెను.
ఉ.:
సత్యము నీవెరుంగక విశాల జగత్పరిపాల దక్షునిన్‌
దైత్యవిరోధియంచు నను ధ్యానము చేయక నిల్పుచుంటివే?
కృత్యము నాకు విష్ణుపదగానము, రాక్షస  శ్రేష్ఠ! తండ్రి! నే
భృత్యుడ శౌరికిన్‌విడను పావనుడౌ హరినెంత చెప్పినన్‌
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-35/

Saturday, May 17, 2025

శ్రీరామాంజనేయ యుద్ధం పద్యనాటకం - 4వ భాగం - తంపులమారి నారదుడు

నేను, నా తమ్ముడు పాణ్యం శంకరశర్మ శ్రీరామాంజనేయ యుద్ధం పద్యనాటకంలో పాత్రలుగా... పద్యాలు పాడాము.
రచన వీరరాఘవస్వామి. ఆయనను 'శేషప్ప'  అని కూడా అంటారు.
4వ భాగం స్వాధ్యాయ ఛానెల్‌లో చూడండి/వినండి.




అమ్మకు గాన నీరాజనం

11 మే 2025 - అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా నేను అమ్మపై బృందావన సారంగి రాగంలో అమ్మ గురించి పాడిన గీతం 'మాతా తవ వందనం'
స్వాధ్యాయ యూట్యూబ్ చానెల్‍లో చూడండి/వినండి.




పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 34వ భాగం లింక్

చం.:
ఒక పరి నవ్వు బిగ్గరగ, నొక్కపరిన్‌విలపించు, శ్రీహరిన్‌
సకలముగా భజంచుతరి సంతసమందునలౌకికంబుగన్‌
ఒకపరి దుఃఖమొందు మరియొక్కపరిన్‌పెనుసంభ్రముంబుతోన్‌
రకరకమైన మానసిక లక్షణుడై చరియించు వ్యగ్రతన్‌
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-34/



Monday, May 5, 2025

శ్రీరామాంజనేయ యుద్ధం పద్యనాటకం - మూడవ భాగం

నేను, నా తమ్ముడు పాణ్యం శంకరశర్మ శ్రీరామాంజనేయ యుద్ధం పద్యనాటకంలో పాత్రలుగా... పద్యాలు చదివాం.
రచన వీరరాఘవస్వామి. ఆయనను 'శేషప్ప'  అని కూడా అంటారు.
మూడవ భాగం స్వాధ్యాయ ఛానెల్‌లో చూడండి/వినండి.




నా పద్యకావ్యం 'శ్రీ వీరబ్రహ్మేంద్ర వైభవము' ఆవిష్కరణ

4 మే 2025 న, నేను రచించిన, 'శ్రీ వీర బ్రహ్మేంద్ర వైభవము' అను పద్య కావ్యమును మాన్యులు, మైదుకూరు శాసనసభ్యులు, పూర్వ టీటీడీ చైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆవిష్కరించారు.
చిత్రంలో దేవస్థానం ఈ.ఓ, శ్రీ శంకర బాలాజీ, మఠాధిపతి శ్రీ నొస్సమ్ వెంకటాద్రి స్వామి, దేవస్థాన ఆస్థాన పండితులు మొ. వారు 🙏
వేదిక: నూతనముగా నిర్మించిన కళ్యాణ మంటపం, బ్రహ్మం గారి మఠం 🙏





పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 33వ భాగం లింక్

తే.గీ.:
అనుచు తెలిపెను దేవశ్రవముని యపుడు
గాలవమునికి బ్రహ్లాదు గాఢభక్తి
మధుర వచనములను గూర్చు విధము దనర
నితరమునులును సంతోషమతులు యనగ
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-33/

 

 

నా కథ 'కుల' వారి కోడలు

నేను రచించిన 'కుల' వారి కోడలు అమెరికా భారతి పత్రిక ఏప్రిల్ 2025 సంచికలో ప్రచురితమైంది. ఆ కథని ఇక్కడ చదవండి.


 




Click on images to view in bigger size

 

పరిశోధనా గ్రంథం 'శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 13వ భాగం లింక్👆

సంచిక మాస పత్రికలో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తోంది. ఇది 13వ భాగం. 🙏
~
గోపాలరావుకు మనవరాలి మీద అంతులేని నమ్మకం. ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని నమ్మేవారిలో అతడొకడు. పార్వతితో ఇలా వాదిస్తాడు.
“ఆడపిల్లలు మగపిల్లలతో సరిసమానంగా చదువుకోవాలని మేమంతా కలలు కన్నాం. అది కళ్లతో చూస్తున్నాం. ఆ మార్పు చూసి ఆనందించడానికి బదులు ఇంకా ‘ఆడపిల్లవు కాబట్టి కట్టుదిట్టాల్లో ఉండాలి’ అనీ బి.సి. నాటి నమ్మకాలు పట్టుకొని వేళ్లాడకు. తమకు కలిగిన అవకాశాలని, స్వేచ్ఛని దుర్వినియోగం చేసేది మగపిల్లలు గాని.. ఆడపిల్లలు మటుకు కాదు.” (పుట 165)
“చీకటి పడేదాకా ఆడపిల్ల..” అంటుంది పార్వతి.
“ఆ మాటే, ఆ వివక్షలే వద్దంటున్నాను. చదువు ఆడపిల్లకి విచక్షణ, ఆత్మస్థయిర్యమూ ఇచ్చేందుకు కారణం కావాలి” (పుట 166).
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-13/

 

 

 



పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 32వ భాగం లింక్

వచనము:
లీలావతీదేవి, హరిమగ్నమానసుండైన తనయుని గర్భంబునందు దాల్చుటచేత నిరంతరము తన ప్రాణమును, శరీరమును, హృషీకేశు చరణకమలములకు నర్పింపవలయునని భావించు చున్నను, తనపతి నిరంతర హరిద్వేషాంతర్గత మానసుండగుట చేత, తన భక్తి భావంబులను మనసులోనే అణచుకొనియుండి, పుత్ర జననముకై నిరీక్షించుచుండెను.
కం.:
దినదిన గర్భభరాలస        
తన సతిగని దనుజవిభుడు దద్దయు బ్రీతిన్‌
ఘనముగ పుంసవనంబును
అనువుగ సీమంతవిధిని నటు జరిపించెన్‌
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-32/