Monday, July 7, 2025

భావ దారిద్ర్యం - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

పూర్వం నిద్రాదరిద్రుడనే ఒక కవిగారుండేవారు. ఆయన రాసింది ఒకే శ్లోకం. కాని దానికి చాలా పేరొచ్చిందట. ఆ శ్లోకం ఇది.. 
“ధనహీనమపి జీవితం తు సవ్యమ్/గుణహీనమపి జీవితం తు భావ్యమ్/నిశాంతునిద్రా దరిద్రోహం నిత్యం/ఏతత్ దుస్సహం మమ దుర్భరం చ.” 
జీవితంలో డబ్బులు లేకపోయినా సహించవచ్చు. గుణం లేని జీవితం కూడా ఉండచ్చు. కాని, రోజూ రాత్రి నాకు నిద్రా దరిద్య్రం పట్టింది. అది చాలా దుస్సహం, దుర్భరం. నిజమే సుమండీ! నిద్ర పట్టకపోవడం ఒక జబ్బు. దాన్ని ఇంగ్లీషులో ‘ఇన్‌సోమ్నియా’ అంటారని మీకు తెలుసు. ఇంట్లో అందరూ గాఢంగా నిద్దరోతూంటే, మనం మాత్రం గుడ్లగూబలా కళ్ళు తెరుచుకొని మేలుకొని ఉంటే, అది నరకం కాక మరేంటి? కొందరు లక్కీ భాస్కర్లుంటారు. బస్సు లేదా రైలు లేదా విమానం, ఏదెక్కినా, కదిలిన మరుక్షణం నిద్రలోకి జారుకుంటారు. వారికి నా లేజీ సలామ్!
ఎక్కడికో... వెళ్లిపోయాననుకుంటున్నారు కదూ! వస్తున్నా వస్తున్నా! మీ జేబు లోంచి పది రూపాయలు మిమ్మల్ని అడక్కుండా నేను తీసుకున్నా పర్లేదండి. కాని మీ భావాన్ని నేను నాదని చెప్పుకుంటే మటుకు అది చాలా పెద్ద తప్పు. దీన్ని భావ చౌర్యం అంటారు. ప్లాజియరిజమ్ అన్న మాట. ‘గ్రామర్‌లీ’ అని ఒక భావ చౌర్య పత్తేదారు వచ్చిందట. అదేనండీ బాబూ, ప్లాజియరిజమ్ చెకర్! అది కృత్రిమ మేధతో పని చేస్తుందట. ఏడ్చినట్లుంది!
మనం తరచుగా చూస్తూంటాం - “ఫలానా సినిమా కథ నాది, నాకు తెలియకుండా దాన్ని సినిమా తీశారు” అని రచయిత/త్రులు కోర్టుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి నవలను దాసరిగారు ‘గోరింటాకు’ సినిమాగా తీసినప్పుడు ఇదే వివాదం. ఇటీవల ‘శ్రీమంతుడు’ సినిమా కథ కూడ తనదేనని శరత్‌చంద్ర గారు కోర్టుకెళ్లారు. సాహసికులు భావచోరులను కోర్టుకీడుస్తారు. అంత సీన్ లేనోళ్ళు గమ్మునుంటారు! అయినా నాకు తెలిసే అడుగుతానండీ, అన్నన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసి తగలేసే సదరు నిర్మాతలకు, దర్శకులకు ఏం రోగం? రచయిత ఎవరో తెర మీద వేసి, ఆయనకు సముచితమైన పారితోషికం ఇస్తే మర్యాదగా ఉంటుంది కదా! ఆయనేమైనా ‘హీరో’ కిచ్చినంతమ్మని అడగడు కదా! సృజనశీలురెప్పుడూ అల్ప సంతోషులేనండోయ్!
ముఖపుస్తకంలో భావచోరులు చెలరేగిపోతున్నారట. “‘నా గోడ’ మీద (అదేనండి ఎఫ్.బి. వాల్) నేను పెట్టిన పోస్టును (అది చక్కని కోట్ కావచ్చు. కవిత కావచ్చు. ఇంకోటి కావచ్చు) ఇంకోడెవడో తన పేరు మీద వాడి గోడ మీద పెట్టేసుకున్నాడు” అని కొందరు వాపోతుంటారు. అదేం ఖర్మమో? ‘కాపీయింగ్’ అంత సులభమైపోయింది సాంకేతికత వల్ల! ఆ మధ్య ప్రముఖ రచయిత, సంపాదకులు, శ్రీ జగన్నాథశర్మ గారంతటి వారే, “నా కధలను నన్నడక్కుండా షార్ట్ ఫిల్ములు తీసేసుకుంటున్నారు, నా పేరు లేకుండా నా కథలను, వ్యాసాలను షేర్ చేస్తున్నారు. దీని వల్ల నా కథలపై పరిశోధన చేసే రీసెర్చి స్కాలర్లు అయోమయానికి గురవుతారు. ఇది చట్టరీత్యా నేరం. వారిపై నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను” అని ముఖపుస్తకంలోనే హెచ్చరించారంటే, భావ దారిద్ర్యం, చౌర్యంగా ఎంత దారుణంగా మారిందో అర్థం కావడం లేదూ!


కొందరు తమ కథలకు నవలలకు పేర్లు పెడుతూంటారు. వారి రచనలు, వాళ్లిష్టం అనుకోండి! కాని ఆ పేర్లు సినిమా పాటలలోని పల్లవులలో ఒక భాగం లేదా, ప్రసిద్ధ సినిమా డైలాగులోని ఒక ముక్క అయిఉంటాయి. అంత చక్కని రచన చేసి, దానికి సొంతంగా పేరు పెట్టలేరా? నాకెందుకో అలాంటి పేర్లు చూస్తే, మనస్సు చివుక్కుమంటుందండి! నన్ను సమీక్షా ప్రసంగానికి పిలిస్తే, ఈ విషయాన్ని చెబుతుంటా. సినిమా పేర్లు, సీరియళ్ల పేర్లు కూడ అలాగే, ఏదో పాట లోని ముక్కలు! అది తప్పనను కాని, భావదారిద్ర్యం క్రిందికి వస్తుందేమో మరి!
దాదాపు 30 సంవత్సరాల క్రిందటి సంగతి. నేను అప్పుడు పలాసలో ఇంగ్లీష్ లెక్చరర్‌ని. నేను, మరో లెక్చరర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (సీఫెల్) లో, పి.జి.టి.టి.యి చేస్తున్నాం, డిస్టన్స్ మోడ్‍లో! మాకు కొన్ని అసైన్‌మెంట్స్ ఇచ్చేవారు. అవి పూర్తి చేసి సీఫెల్‌కి పంపాలి. వాటికి గ్రేడ్స్ ఇస్తారు. ఒకసారి ‘క్రిటికల్ ఇంటర్‌ప్రిటేషన్’ (విమర్శనాత్మక వివరణ) లో ‘రాయ్ క్యాంప్‌బెల్’ అన్నకవి వ్రాసిన ‘ది జులు గర్ల్’ అన్న పద్యాన్నిచ్చారు. అద్భుతమైన కవిత అది. అందులో ఒక పేద అమ్మాయి, బాలింత, ఎర్రటి ఎండలో పని చేస్తుంటాంది. తన నెలల పిల్లవాడిని ఒక చెట్టు నీడన, గుడ్డ ఉయ్యాలలో పడుకోబెడుతుంది. పిల్లవాడు లేచి ఏడుస్తాడు. ఆమె వాడికి తన స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, పాలుండవు. ఆమెకు తిండి ఉంటే కదా! ఈ నేపథ్యం దక్షిణాఫ్రికాది. ఆమె కన్నీరు కారుస్తుంది. ఇంకా చాలా ఉంది కాని, పద్యంలోని ఇమేజరీ (భావసామగ్రి), మెటఫర్ (రూపకం) ఇవన్నీ వివరిస్తూ అసైన్‌మెంట్ వ్రాసి పెట్టుకున్నా.
ఎప్పుడు చూసాడో, నా కొలీగ్, దాన్ని యథాతథంగా కాపీ చేసి, తన పేరున అసైన్‌మ్ంట్ సీఫెల్‌కు పంపేశాడు! తర్వాత కొన్ని రోజులకు నేను పంపాను. అతనికి ‘ఎక్సలెంట్!’ అని, ‘ఎ ప్లస్’ గ్రేడ్ ఇచ్చారు. నాకు ‘E’ గ్రేడ్ ఇచ్చి, “రీ డూ” (మళ్లీ చెయ్యి రా వెధవా!) అని రాశారు. అది చాలక, “నీవు నీ అసైన్‌మెంట్ వేరే అభ్యర్థి దాన్లోంచి కాపీ కొట్టినట్లుంది. ఈసారి జరిగితే ఖబడ్దార్!” అని మార్జిన్‌లో హెచ్చరిక! “ఏంటి బాబూ ఇలా చేశావు?” అని మావాడినడిగితే, “సారీ, బ్రదర్” అని ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయాడు! భావచోర్! 
నా మటుకు నేను అన్ని జోనర్ లతో రచనలు చేస్తుంటా. వివిధ విషయాలను ఉటంకిస్తూ ఉంటా. కాని అవి ఎవరు చెప్పారో, రాశారో తప్పనిసరిగా చెబుతా! మనది కాని దాన్ని మనదిగా చెప్పుకోవడం ఆత్మహత్యా సదృశం అంటా నేను! “నాకు రాదు, నీవు రాసియ్యి!” అంటే కొంత నయం! భావదరిద్రులకు నా శత కోటి మొట్టికాయలు! అదన్నమాట!



‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ పద్యకావ్యం ఆవిష్కరణ మహోత్సవము - నివేదిక

నేను రచించిన ‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ పద్యకావ్యం 30 జూన్ 2025న హైదరాబద్ నల్లకుంట లోని డి.డి. కాలనీలోని అహోబిలమఠంలో ఆవిష్కరించబడింది.
సంబంధిత నివేదిక సంచికలో ప్రచురితమైంది.

కవి తన కావ్యములోని పద్యములను శ్రావ్యముగా గానం చేస్తూ వాటిని వివరించినారు. నృసింహావిర్భావ ఘట్టమును దత్తశర్మ వివరిస్తూండగా, సభికులు భక్తిపరవశులైనారు. వారు ప్రసంగం మొదట ఆలపించిన నృసింహ ధ్యాన శ్లోకము భక్తులను విశేషముగా ఆకట్టుకున్నది. నరసింహ ప్రభువు, భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాద కుమారుని దగ్గరకు తీసుకొని, లాలించి ఆశీర్వదించగా, ఆ బాలుడు “పరమాత్మా! రక్తంతో తడిసిన నీ నాలుకను చూసి కరాళ దంష్ట్రలను చూసి, నేను అందరివలె భయలేదు స్వామీ! కానీ
తేగీ: 
భయము గల్గును సంసార బంధములను
భయము గల్గును కర్మాను భవము వలన 
భయము గల్గును షడ్వర్గ భావనములను 
అట్టి భయమును తొలగించు ఆదిపురుష!”
అని వేడుకొన్నాడని, కవి ఆలపించగా, సభికులు పులకించిపోయారు. 
~
(పూర్తి నివేదికని సంచికలో చదవగలరు)

 


 


https://sanchika.com/srilakshminrusimhamaaahtymaym-book-release-event-report/

 

‘శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 15వ (చివరి) భాగం

సంచిక మాస పత్రికలో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తోంది. ఇది 15వ  (చివరి) భాగం. 🙏
~
అక్కడి పరిస్థితిని మాలతమ్మ ఇలా వర్ణించారు.
“క్యూరియాసిటీ.. కుతూహలం - ఎమర్జెన్సీ పెట్టి ఇన్ని ఘాతుకాలు చేసిన వ్యక్తి ఎలా ఉంటుందో - ఏం మాట్లాడుతుందో చూద్దామని వచ్చి ఉంటారు.” 
“అది మానవ నైజంలో ఒక భాగం. ఖైదీకి గాని, నేరస్థునికి గాని బేడీలు వేసి తీసుకొని వెళుతుంటే, రోడ్డు మీద జనం ఆగిపోయి విచిత్రంగా చూస్తారు.”
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-15/

'ధర్మబోధ' పుస్తకంపై సమీక్ష

 శ్రీ శంకర్ నారాయణ గారు 'ది ప్రాఫెట్'కు స్వేచ్ఛానువాదం చేసి ప్రచురించిన 'ధర్మబోధ' అనే పుస్తకంపై నా సమీక్ష సంచికలో ప్రచురితమైంది.
"కావ్యమంతటా, కవిగారి ‘Non-attachment’ మనకు గోచరిస్తూ ఉంటుంది. వెరసి ‘ధర్మబోధ’ ఒక చక్కని అనువాద రచన." 
(పూర్తి సమీక్షని సంచికలో చదవండి)
~

 


 https://sanchika.com/dharmabodha-book-review-pds/